క్రీ.పూ. 10,000 నాటికి ప్లీస్టోసీన్ యుగం ముగిసి హోలోసీన్ (వెచ్చని వాతావరణం) యుగం ప్రారంభమవడంతో మధ్య రాతియుగం (Mesolithic Age) ఆవిర్భవించింది. వాతావరణంలో వచ్చిన ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల వృక్ష, జంతుజాలాలలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి.
చిన్న జంతువులు, పక్షులు, జలచరాలు విస్తరించడంతో మానవుడు వేగంగా వేటాడటానికి అవసరమైన తేలికపాటి పరికరాల తయారీపై దృష్టి సారించాడు. ఇది పాత రాతియుగానికి, నవీన రాతియుగానికి మధ్య సంధి కాలంగా నిలుస్తుంది.
